Another Kiosk Machine Donated To Ttd: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళాలు అందించేందుకు కియోస్క్ మెషీన్లను అందుబాటులోకి తెచ్చింది. తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయానికి సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా ఒక యంత్రాన్ని అందజేసింది. తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చారు.
హైలైట్:
- తిరుమలలో మరో సౌకర్యాన్ని తీసుకొచ్చింది
- భక్తులు మొబైల్తో స్కాన్ చేస్తే సరిపోతుంది
- డబ్బులు లేకపోయినా పర్లేదు.. సింపుల్గా

ఇప్పటికే సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మెషిన్ అందించగా తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనంలో అందుబాటులో ఉంగా.. ఈరోజు ఇచ్చిన మెషిన్ను తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలోకి ఉపయోగంలోకి రానుంది. కియోస్క్ మెషిన్లను తిరుమల అన్నదానం, పద్మావతీ గెస్ట్ హౌస్, సీఆర్వో ఆఫీస్ , దేవుని కడప, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటిమిట్ట, శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చెన్నై , బెంగళూరు, విజయవాడలలో టీటీడీ వినియోగిస్తోంది. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ఈవో జె శ్యామలారావు తిరుమలలోని సహజ శిలా తోరణం, చక్ర తీర్థాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తన తనిఖీలో భాగంగా ఈ ప్రాంతాలలో పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను మరియు అక్కడే ఉన్న శ్రీ శివుని సాన్నిధ్యాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆ ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూధన్, టీటీడీ అటవీ శాఖ సిబ్బంది, ఇతరులు కూడా హాజరయ్యారు.
టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, వీజీవో సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు ‘హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఒక పూట మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.