కర్ణాటకలో ఒక సిగ్గుమాలిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ హవేరి జిల్లాలోని అక్కి-ఆలూర్ గ్రామంలో, సామూహిక అత్యాచార కేసులో ఏడుగురు నిందితులకు బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన కీచకులు సంబరాలు జరుపుకున్నారు. కారులో, బైక్పై విజయోత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత సాధారణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో నలుగురిని మళ్లీ అరెస్టు చేశారు.
మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఏడుగురు నిందితులూ మే 20న జైలు నుండి విడుదలయ్యారు. పోలీసులు నిందితులందరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కొత్త కేసు నమోదు చేశారు. ఏడుగురు అనుమానితులలో నలుగురిని తిరిగి అరెస్టు చేసినట్లు ఎస్పీ ఎకె శ్రీవాస్తవ తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం వెతుకుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘించిన కారణంగా నిందితుల బెయిల్ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది.
హవేరి జిల్లాలోని ఈ కేసు 2024లో ఒక ప్రైవేట్ లాడ్జిపై జరిగిన దాడితో ప్రారంభమైంది. ఒక మతాంతర జంట ఒక లాడ్జిలో ఉండగా, కొందరు దుండుగులు దాడి చేశారు. ఆ తర్వాత 26 ఏళ్ల మహిళను అడవిలోకి తీసుకెళ్లి, ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితిరాలు సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు అదే వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత హంగల్ తహసీల్దార్ సమక్షంలో నిర్వహించిన అధికారిక గుర్తింపు పరేడ్లో నిందితులను గుర్తించారు.
నిందితులను అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మందక్కి, సమివుల్లా లాల్నవర్, మహమ్మద్ సాదిక్ అగసిమణి, షోయబ్ ముల్లా, తౌసీప్ చోటి, రియాజ్ సావికేరిగా గుర్తించారు. అయితే, తాజాగా బాధితురాలు తన మునుపటి సాక్ష్యాన్ని ఉపసంహరించుకోవడంతో నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులు 17 నెలలకు పైగా జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన దుండగులు, కారు, బైక్లతో భారీ ఊరేగింపు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. దీంతో మరోసారి హాట్టాఫిక్గా మారారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..