
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపులు ఇచ్చినట్టు ఎయిర్టెల్ వెల్లడించింది. ప్రస్తత విపత్తు సమయంలో ఎయిర్టెల్ నెట్వర్క్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రస్తుతం కస్టమర్ల ప్లాన్ గడువు ముగిసి లేదా రీఛార్జ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ బంపరాఫర్ను అందుకోనున్నారు. ఈ మేరకు ఎయిర్టెల్ సంస్థ మంగళవారం (సెప్టెంబర్ 3) ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ విషయానికి వస్తే.. మొబైల్ సర్వీసులకు అంతరాయం కలగకుండా చెల్లింపు గడువు తేదీలను 7 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రీపెయిడ్ హోమ్స్కు సంబంధించి చెల్లుబాటు గడువు ముగిసిన లేదా రీఛార్జ్ చేయలేని కస్టమర్లు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని అందుకుంటారని పేర్కొంది. వైఫై సేవలకు అంతరాయం లేని యాక్సెస్ను అందిస్తామని హామీ ఇచ్చింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు సహాయం చేయడానికి.. ఈ చర్యలు తీసుకున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, ఇంధన సరఫరాల విషయంలో అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, అవసరమైన చోట పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్టెల్ నెట్వర్క్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.

