
స్కూల్/కాలేజీలో విధుల్లో ఉన్న ప్రిన్సిపల్ విజయలక్ష్మి, మహిళా టీచర్లు, అధ్యాపకులు, స్థానికులు అలర్ట్ అయ్యారు. డార్మిటరీలో ఉన్న విద్యార్థినులు అందరిని ఎత్తులో ఉన్న డైనింగ్ హాలులోకి జాగ్రత్తగా చేర్చారు. అప్పటికే అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు.. ఈ వరదపై సమాచారం ఇవ్వడంతో వారు స్కూల్/కాలేజీ దగ్గరకు వాహనాలను పంపించారు. అక్కడి నుంచి విద్యార్థినులను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక్్కడ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ మహిళలు.. అయినా సరే వీరు ఎంతో చాకచక్యంగా వ్యవహారించారు.. వేగంగా స్పందించి విద్యార్థినిలను రక్షించారని ఉన్నతాధికారులు, విద్యార్థినుల తల్లిదండ్రులు వీరిని ప్రశంసించారు. అక్కడి స్టాఫ్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో వరదలో చిక్కుకుపోయిన 600 మంది గురుకులం విద్యార్థినులు పెద్ద ముప్పు నుంచి బయటపడ్డారు.
ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు
విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు మొదలయ్యాయి. బ్యారేజీ 67, 68, 69 నెంబర్ గేట్లకు ఇంజినీరింగ్ నిపుణుడు, ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు , అధికారులు, నిపుణుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. అలాగే బ్యారేజీలో ఇరుక్కున్న పడవలను బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది తొలగిస్తుండగా.. ముందుగా 67, 69 గేట్లు మూసి ఆ తర్వాత బోట్లను తొలగిస్తారు. ఇటీవల భారీ వరదలకు ప్రకాశం బ్యారేజి గేట్లకు నాలుగు బోట్లు వచ్చి అడ్డు తగిలాయి. ఒక బోటు ఢీకొట్టడం వల్ల 69వ గేటు కౌంటర్ వెయిట్ దెబ్బతింది. అలాగే 67, 68, గేట్లకు రెండు బోట్లు అడ్డుగా ఉండటంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సరిగా లేకుండా పోయింది. ఏడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ గేట్ల ఏర్పాటు పనులు పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు.

