
మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా పడుతున్న ఎడతెరిపి లేని వర్షాలతో.. విశాఖలోని గోపాలపట్నంలో భారీ కొండచరియ విరిగిపడింది. రెండు ఇళ్లు ప్రమాదకరంగా మారడంతో.. అప్రమత్తమైన అధికారులు వెంటనే సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు.
వాయుగుండం ప్రభావంతో సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున నమోదైన వర్షపాతాన్ని చూసి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రధానంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇక ఏలేరు రిజర్వాయర్కు భారీ వరద వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. మరోవైపు వంశధార, నాగావళి నదులకు వరద పెరుగుతుందని జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
మరోవైపు ఉత్తరాంధ్రలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఆదివారం పలు విమానాలు ఆలస్యం కాగా.. ఒక సర్వీసు రద్దు చేశారు. బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన విమానం ఆలస్యమైంది. ఎయిర్ ఏషియా విమానం ఉదయం 7.55 గంటలకు రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12:10 గంటలకు వచ్చింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఉదయం 11:25 రావాల్సిన ఎయిరిండియా విమానం.. మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకుంది. అలాగే వాతావరణం అనుకూలించక పోవడంతో కౌలాలంపుర్ ఎయిర్ ఏషియా విమానాన్ని రద్దు చేశారు.

