
మరోవైపు శనివారం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం పలు విమానాలు ఆలస్యం కాగా.. మరో విమానం రద్దు చేశారు. ఆదివారం బెంగళూరు నుంచి విశాఖకు రావాల్సిన ఎయిర్ ఏషియా విమానం ఉదయం 7.55 గంటలకు బదులు, ఆలస్యంగా మధ్యాహ్నం 12:10 గంటలకు వచ్చింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఎయిరిండియా విమానం ఉదయం 11:25 రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చింది. కౌలాలంపుర్ ఎయిర్ ఏషియా విమానాన్ని వాతావరణం పూర్తిగా అనుకూలించక రద్దు చేశారు. ఇవాళ కూడా వాతావరణ పరిస్థితుల్ని బట్టి విమానాల సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు.
విశాఖపట్నంలో వాయుగుండం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశించారు. అలాగే అధికారులు కొండవాలు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.. మొత్తం 80 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సొంత వాహనదారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను కూడా హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రయాణం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొండ చరియలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలు విరమించుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు భారీగా కురుస్తున్న వానలతో విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.. అక్కడ కొండచరియలు పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

