
విజయవాడలోని అజిత్సింగ్నగర్, నున్నలో జనాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోగా.. ఈ విషయాన్ని గమనించిన కొందరు కేటుగాళ్లు.. తాళాలు పగులగొట్టి లోపల ఉన్న విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతున్నారు. వాంబేకాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో కూడా చోరీలు జరిగాయి. రాత్రి వేళల్లో ఈ దొంగతనాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉండటంతో దొంగలు చోరీలకు తెగబడతున్నారు. ఇలా వరుసగా చోరీలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో దొంగతనాలు జరుగుతుండగా.. పగటి సమయంలో ఇళ్లకు వచ్చిన యజమానులు చోరీలతో కన్నీటిపర్యంతం అవుతున్నారు.
వరదలో జనాలు అల్లాడిపోతుంటే.. వాళ్ల ఇళ్లలో చోరీలు చేయడం మరీ దారుణంగా ఉంది. ఇలాంటి కష్ట సమయంలో సాయం చేయాల్సిందిపోయి.. దొంగతనాలు ఎలా చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చోరీలు జరుగుతుండటంతో.. అక్కడ పోలీసులు గస్తీని కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలు వరద బాధితులకు కొత్త కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. మరోవైపు వరదలో మునిగి వాహనాలు, విలువైన వస్తువులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు సంబంధించి బీమా, రిపేర్లపై ఫోకస్ పెట్టింది. అలాగే టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఇతర వస్తువుల రిపేర్లకు సంబంధించి ఆయా కంపెనీలతో మాట్లాడుతున్నారు. మరికొందరు స్థానిక మెకానిక్లు కొందరు ఉచితంగానే వరద బాధితులకు సర్వీస్ చేస్తున్నారు.

