బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి అలంకారాలు
- సెప్టెంబర్ 22- బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం
- సెప్టెంబర్ 23- గాయత్రి దేవి అలకారం
- సెప్టెంబర్ 24 – అన్నపూర్ణ దేవి అలంకారం
- సెప్టెంబర్ 25 – కాత్యాయిని దేవి అలంకారం
- సెప్టెంబర్ 26 – మహాలక్ష్మీ దేవి అలంకారం
- సెప్టెంబర్ 27 – లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం
- సెప్టెంబర్ 28 – మహా చండీ దేవి అలంకారం
- సెప్టెంబర్ 29 – సరస్వతి దేవి అలంకారం
- సెప్టెంబర్ 30- దుర్గా దేవి అలంకారం
- అక్టోబర్ 1- మహిషాసుర మర్దిని అలంకారం
- అక్టోబర్ 2 – రాజరాజేశ్వరి దేవి అలంకారం
మరోవైపు దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారని అధికారులు తెలిపారు. ప్రతి రోజు నగరోత్సవాలు జరుగుతాయని.. సమన్వయంతో పనిచేసి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దుర్గ గుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. క్యూలైన్లు, లైటింగ్, తాగునీటి సౌకర్యం వంటి సదుపాయాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. వేడుకలకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు అందరికీ అమ్మవారి లడ్డూ ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని దుర్గమ్మ భక్తులు కోరుతున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ వీఐపీ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనం వేళలు పక్కాగా అమలు చేయాలని కోరుతున్నారు. దుర్గాఘాట్లో సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. భవానీ భక్తులు స్నానాలు ఆచరించేందుకు వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.


