Tirumala Srivari Mettu Walkway Elephants Alert: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు సంచారం భక్తుల్లో కలకలం రేపింది. 11 ఏనుగులు గుంపుగా తిరుగుతూ పంట పొలాలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఏనుగుల కదలికలను డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!
హైలైట్:
- తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు
- రంగంలోకి దిగిన అటవి, టీటీడీ అధికారులు
- మెట్టు మార్గంలోకి భక్తుల్ని గుంపులుగా అనుమతి

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏనుగుల సంచారంపై ప్రజల్ని అప్రమత్తం చేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఏనుగుల గుంపుల సంచారం, పంట పొలాలను ధ్వంసం చేయడం, ఏనుగుల దాడిలో ఇటీవల ఒక రైతు దుర్మరణంపై సమీక్షించారు. సోమవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వివరాలు అందించారు. 11 ఏనుగులు (ఇందులో నాలుగు ఏనుగులు పిల్లలు) ఒక గుంపుగా తిరుగుతూ కళ్యాణి డ్యామ్ సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు తొక్కివేశాయని వివరించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. 2.5 కేజీల బంగారంతో
‘చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయి అనేది పరిశీలించడానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్న క్రమంలో… అవి వెళ్ళే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాలవారిని అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. గ్రామాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటికి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపించాలి. ఏనుగుల కదలికలు, హెచ్చరిక సందేశాలు పంపించడాన్ని డి.ఎఫ్.ఓ. కార్యాలయాలు, పి.సి.సి.ఎఫ్. కార్యాలయం పర్యవేక్షించాలి. వీటితోపాటు ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా, అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలి’ అని సూచనలు చేశారు.


