ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్ట్ 15 నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధంగానే ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకానికి త్వరలోనే మంచి పేరు పెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో ఎలా అమలవుతోందో.. అదే విధంగానే ఏపీలోనూ అమలు చేయనున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అన్ని పథకాల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉచిత బస్సు పథకానికి ఉంటారన్న మంత్రి.. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకానికి మంచి పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని.. రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. సింగపూర్లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పదేళ్ల ముందే చెప్పారని.. అందుకు అనుగుణంగా సింగపూర్ ప్రభుత్వ ఆర్టిటెక్టులతో అద్భుతమైన డిజైన్ చేయించారని అన్నారు. అమరావతిలో వేలకోట్ల అక్రమాలు అంటూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు చేసిందని.. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని స్పష్టమైందని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో అమరావతి నిర్మాణం జరిగేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తుంటే.. వైసీపీ దుష్ర్పచారం చేస్తోందని రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చూసి ఓర్వలేకే వైసీపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు. కక్షపూరితంగా చర్యలు తీసుకోవాలంటే వైసీపీ నేతలను ఇప్పటికే అరెస్ట్ చేసి ఉండొచ్చన్న మంత్రి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిని చట్టపరంగా శిక్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ఉన్న సమయంలో తప్పు చేశారు కనుకే.. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రోజాపై మంత్రి విసుర్లు
మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ నేత రోజాపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న సమయంలో రోజా క్రమశిక్షణతో ఉన్నారని.. వైసీపీలోకి వెళ్లిన తరువాత రోజా క్రమశిక్షణ తప్పారని అన్నారు. రోజాపై అభాండాలు, విమర్శలు తాము చేయమని.. మహిళలు అంటే తమ ప్రభుత్వానికి చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ వద్ద మెప్పు పొందేందుకు రోజా ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు.


