బాధితురాలు తొలుత వైద్య పరీక్షలకు అంగీకరించలేదు. కేసు దర్యాప్తులో భాగంగా పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు సూచించగా.. ఆమె తిరస్కరించి వెళ్లిపోయారు. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో టెస్టులు చేయించుకునేందుకు అంగీకరించారు. అయితే, వైద్య పరీక్షలను తిరుపతి రుయా ఆస్పత్రిలో కాకుండా ప్రసూతి ఆస్పత్రిలో చేయించుకుంటానని కోరడంతో పోలీసులు అందుకు ఏర్పాట్లు చేశారు.
పోలీసుల సహకారంతో బాధితురాలు బుధవారం మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం జాయిన్ అయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధపడి వచ్చిన బాధితురాలు.. ఆ మేరకు టెస్టులన్నీ చేయించుకున్నారు.
మరోవైపు.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం కూడా డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం చెన్నై నుంచి పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యే నివాసం వద్దకు ఇతరులెవరినీ అనుమతించలేదు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి నగరంలోని బీమాస్ హోటల్ గదిలో తనపై లైంగిక దాడి చేశాడని తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.