ఆతిశీ 2013లో ఆప్లో చేరారు.. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడేళ్లపాటు మనీశ్ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా విధులు నిర్వహించారు.. 2019 ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి లోక్సభకు పోటీచేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
2023 ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఆతిశీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లి మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కావడంతో ఆప్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఆతిశీ ఆర్థికశాఖసహా కీలక శాఖల బాధ్యతల్ని చూశారు. ఇప్పుడు ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. ఆతిశీ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్ సింగ్, త్రిప్తా వహి దంపతుల కుమార్తె.. ఆమె విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్డేల్ స్కూల్లో జరిగింది. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ (హిస్టరీ) చేశారు.. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆప్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అలాగే మంత్రిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.