దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం అమృత భారత్ పథకం తెచ్చింది. ఇందులో భాగంగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఏళ్ల తరబడి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఊరట లభించనుంది. ఫ్లాట్ఫారాల పొడిగింపు, షెడ్ల నిర్మాణం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే స్టేషన్ కొత్త కళతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

అమృత్ భారత్ పథకంలో భాగంగా చీపురుపల్లి రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ పనులతో చీపురుపల్లి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. చీపురుపల్లి, రాజాం, పాలకొండ ప్రాంతాల నుంచే కాక.. పరిసర మండలాల ప్రజలు కూడా ఈ స్టేషన్ నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఏళ్ల తరబడి స్టేషన్ అభివృద్ధికి నోచుకోకపోవడంతో.. అరకొర సౌకర్యాలతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈక్రమంలో ప్రయాణికులు ఊరట కలిగించేలా.. చీపురుపల్లి స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగం చేశారు. దీంతో ఈ స్టేషన్లో అభివృద్ది పనులకు మార్గం సుగమం అయ్యింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికలకు ముందే స్టేషన్ అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అయితే ప్రారంభంలో అభివృద్ధి పనులు నిదానంగా సాగినా.. ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. దీంతో స్టేషన్లో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.
దీనిలో భాగంగా స్టేషన్లోని మూడు ఫ్లాట్ఫారాలను చివరివరకు పొడిగించారు. అలానే షెడ్లు ఏర్పాటు చేసి.. గచ్చులు కూడా వేశారు.ఈ స్టేషన్కు వచ్చే రైళ్ల బోగీల నంబర్లు ముందుగానే ప్రయాణికులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేశారు. అలానే స్టేషన్కి వచ్చే ప్రయాణికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించగా.. దాని పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలానే స్టేషన్లో ఉన్న ఫ్లాట్ఫారాలపై పాత గచ్చులు తొలగించి.. వాటిని కొత్తగా నిర్మించారు. కొద్ది నెలల కిందట నిలిచిపోయిన నూతన భవన నిర్మాణ పనులను కూడా తిరిగి ప్రారంభించారు.


