ఇప్పుడొచ్చే స్మార్ట్ ఫోన్లు పవర్ఫుల్ బ్యాటరీస్తో వస్తున్నాయి. చాలా సేపు వాడినా బ్యాటర్ ఉండేలా ఎక్కువ ఎంఏహెచ్ కలిగి ఉంటున్నాయి. అయితే మనలో చాలా మంది రోజు మొత్తంలో కనీసం ఒక పది నిమిషాలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాం. కాల్స్ మాట్లాడటం, మెసేజులు చేయడానికి మాత్రమే ఫోన్ పరిమితం కాలేదు. ప్రపంచం మొత్తం అందులోనే ఉన్నట్లు.. ప్రతి క్షణం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. రీల్స్ చూడ్డం అయితే ఒక వ్యసనంలా మారిపోయింది. అలాగే యూట్యూబ్ వీడియోలు అదనం. ఇలా ఫోన్ను పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నాం.
మరి ఇంతలా రోజంతా వాడాలంటే అందులో ఛార్జింగ్ ఉండాలని.. వందశాతం నిండిపోయేదాకా ఛార్జ్ చేస్తాం. కొంతమంది అయితే రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి.. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఛార్జింగ్ తీస్తుంటారు. రాత్రి మొత్తం ఆ ఫోన్ ఛార్జ్ అవుతూనే ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా ఫోన్లోకి పవర్ సప్లయ్ అవుతూనే ఉంటుంది. హండ్రెడ్ పర్సంట్ ఉన్నా సరే కేబుల్ తీయరు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. అలా ఫుల్ ఛార్జ్ పెడితే ఫోన్లోని లిథియం – అయాన్ బ్యాటరీపై ఒత్తిడి పెరిగి దాని పనితీరు దెబ్బతింటుంది. 100 శాతం చేరుకున్న తర్వాత కూడా ప్లగ్ ఉంచితే అది ‘ట్రికిల్ ఛార్జింగ్’ స్థితిలోకి చేరుతుంది. దీనివల్ల వేడి ఉత్పత్తి అయి బ్యాటరీ చెడిపోతుంది. బ్యాటరీ పాడవ్వకుండా ఉండాలంటే ఛార్జ్ను 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఉంచాలి. అలాగే ప్రతి రోజు ఒకే టైమ్లో ఛార్జ్ పెట్టడం మంచిది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

