ప్రభుత్వ ఉద్యోగి భార్య, తన స్థాయిని మర్చిపోయి తోటి ప్రయాణికురాలి పర్స్ దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత, ఆమె తన భర్తతో కలిసి వేరే బస్సులో వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడ బస్టాండ్లో వెలుగు చూసింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నిందితురాలి భర్త అయిన ఎంపీడీవో భార్యను కాపాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
హైలైట్:
- ఎంపీడీవో భార్య చేతివాటం
- విజయవాడ బస్టాండ్లో పర్స్ చోరీ
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్

అదే సమయంలో బాధిత స్టాఫ్ నర్స్ కూడా బస్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంది. ఆమె దగ్గర ఉన్న పర్స్ మీద ఎంపీడీవో భార్య కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని భావించిన నిందితురాలు.. సదరు స్టాఫ్ నర్స్ని తోసుకుంటూ బస్ ఎక్కింది. ఈక్రమంలో పర్స్ కొట్టేసింది. ఆతర్వాత బస్ దిగి టాయిలెట్కి వెళ్లి వచ్చింది. వేరే బస్సులో వెళ్దామని భర్తను అడిగింది. అతడు వద్దని చెప్పి అదే బస్ ఎక్కించారు.
ఆ తర్వాత స్టాప్ నర్స్ గుంటూరులో బస్ దిగి.. బ్యాగ్ చెక్ చేసుకోగా.. ఆమె పర్స్ కనిపించలేదు. దీంతో అక్టోబర్ 30న కృష్ణలంక పోలీసు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గుంటూరు బస్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. సదరు ఎంపీడీవో భార్య.. అదే పనిగా నర్స్ చేతిలో ఉన్న బ్యాగ్ను పరిశీలిస్తుండటాన్ని గమనించారు. ఎంపీడీవో కుమార్తె ధరించిన యూనిఫామ్ ఆధారంగా కాలేజీకి వెళ్లి విచారించారు. ఆమె ఫొటో చూపించగానే.. నిందితుల అడ్రెస్ తెలిసింది.
దీంతో పోలీసులు శుక్రవారం నాడు గుంటూరు వెళ్లి ఎంపీడీవో కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె చేతి వాటం బయటపడింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. బాధితురాలు తన పర్స్లొ 14 గ్రాముల బంగారం, రూ.5వేలు ఉండగా.. ఫిర్యాదులో మాత్రం 4 కాసుల బంగారం, రూ.35 వేలు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.


