విశాఖపట్నం కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. త్వరలోనే విశాఖకు టీసీఎస్ సహా పలు అంతర్జాతీయ కంపెనీలు రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే గూగుల్ సెంటర్ ఏర్పాటుకు కృషి పూర్తైందని.. ఈ నెలాఖరులోనే శంకుస్థాపన ఉంటుందని తేల్చి చెప్పారు. రూ.3,800 కోట్ల పెట్టుబడుల ద్వారా రానున్న 3 ఏళ్లలో 30 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామని.. భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

విశాఖకు వస్తున్న వివిధ కంపెనీల ద్వారా సుమారు రూ.3,800 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. ఈ కంపెనీల ద్వారా రాబోయే మూడేళ్లలో 30 వేల మంది ఏపీ యువతకు ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. గూగుల్ సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఎంతో కష్టపడిందని వెల్లడించిన నారా లోకేష్.. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా లభించిందని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. మరోవైపు.. ఇన్ఫోసిస్ కూడా తమ విస్తరణ కార్యకలాపాలను చేపట్టనున్నట్లు వివరించారు. విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రాజెక్టులు ఉపయోగడపతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం అభివృద్ధిని వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని.. మంత్రి లోకేష్ వెల్లడించారు. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో త్వరలోనే ఆర్సిలర్ మిట్టల్ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మరోవైపు.. త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆక్వా రంగంలో మరింత అభివృద్ధి చేస్తామని నారా లోకేష్ చెప్పారు. దేశంలో తయారవుతున్న ఏసీలలో 70 శాతం ఉత్పత్తి చేసే సంస్థ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు అవుతోందని.. అక్కడ అతిపెద్ద గ్లాస్ సిటీ కూడా రాబోతుందని తెలిపారు. అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని కూటమి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు.


