ప్రస్తుతం ప్రతి వీధిలోనూ ఆర్వో ప్లాంట్లే.. ప్రతి ఇంటిలోనూ వాటర్ క్యాన్లే.. ఈ వ్యాపారం పుష్కలంగా సాగుతూ ఉండటంతో పుట్టగొడుగుల్లా ఆర్వో ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే వీరు సరఫరా చేసే నీటిలో స్వచ్ఛత ఎంత.. తాగడానికి అనుకూలమైనవేనా కాదా.. ఎంతమేరకు ఫిల్టర్ చేస్తున్నారనేదీ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలో అధికారులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. వాటర్ క్యాన్ల నీటిని ఉపయోగించే వారు తప్పనిసరిగా టీడీఎస్ కొలుచుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీడీఎస్ అంటే ఏమిటి?
టీడీఎస్.. అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్.. టీడీఎస్ శాతాన్ని లెక్కగట్టడం ద్వారా మీరు ఉపయోగించే నీటిలో ఎంతమేరకు సాలిడ్స్ ఉన్నాయనేదీ కనుగొనవచ్చు. ఒకవేళ మీరు తాగే నీటిలో వేయికి మించి టీడీఎస్ ఉన్నట్లు తేలితే.. ఆ నీరు తాగడానికి పనికిరానివిగా భావించవచ్చు. అలాగే 200లకు పైగా టీడీఎస్ శాతం ఉంటే.. వాటిని శుద్ధి చేయలేదని పరిగణించవచ్చు. శుద్ధి చేయకుండానే ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు ట్యాప్ వాటర్ మీకు సరఫరా చేశారని తెలిసిపోతుంది. ఇక టీడీఎస్ ఎక్కువగా ఉన్న నీటిని ఎక్కువ కాలం ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. కిడ్నీలు. జీర్ణవ్యవస్థ వంటి అంశాలపై ఇది ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు.
టీడీఎస్ కొలిచేదెలా..?
మరోవైపు నీటిలోని టీడీఎస్ శాతాన్ని లెక్కగట్టడానికి ఓ పరికరం ఉపయోగిస్తారు. దానినే టీడీఎస్ మీటర్ లేదా టీడీఎస్ టెస్టర్ అని పిలుస్తారు. ఆర్వో ప్లాంట్ల నుంచి తెచ్చుకునే వాటర్ క్యాన్ల నీటిని ఉపయోగించేవారు తప్పనిసరిగా ఈ టీడీఎస్ పరికరాన్ని ఇంటిలో ఉంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఇది దొరుకుతుందని.. ధర కూడా అందుబాటులో సుమారుగా రూ.300 వరకూ ఉండొచ్చని చెప్తున్నారు. ఇది ఓ పెన్ను మాదిరిగా ఉంటుందంటున్నారు. టీడీఎస్ మీటర్ చిన్న బ్యాటరీతో పనిచేస్తుందని.. మనం తాగే ఏ నీటినైనా ఈ టీడీఎస్ మీటర్ సాయంతో పరీక్షించవచ్చని చెప్తున్నారు. మరోవైప వర్షపు నీరు భూమిలోకి ఇంకేటప్పుడు .. ఆ నీరు రాళ్లు, మట్టిలో ఉన్న ఖనిజాలను కరిగిస్తుంది. ఈ క్రమంలోనే భూగర్భపు జలాల్లో వివిధ స్థాయిలో ఈ ఖనిజాలు ఉంటాయి. ఈ కారణంగానే కొన్ని ప్రాంతాల్లో నీటిలో pH ఎక్కువగా.. మరికొన్ని చోట్ల తక్కువగాఉంటుందని వివరిస్తున్నారు.


