Cricketer Sri Charani Rs 2.5 Crore Cheque,టీమిండియా క్రికెటర్కు రూ.2.5 కోట్లు చెక్.. స్వయంగా అందజేసిన మంత్రి నారా లోకేష్ – ap minister nara lokesh handed over rs 2 crore 50 lakhs cheque to indian woman cricketer sri charani
Indiaan Cricketer Sri Charani Rs 2.5 Crore: టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసింది. ప్రపంచకప్లో రాణించిన ఆమెకు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించింది. అయితే ఇవాళ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు రూ.2.5 కోట్ల చెక్ అందజేశారు. శ్రీచరణి ఇటీవల డబ్ల్యూపీఎల్లో భారీ ధరకు అమ్ముడై, శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపికైంది.
హైలైట్:
ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి ప్రోత్సహకాలు
రూ.2.5 కోట్లు చెక్కు ఇచ్చిన మంత్రి లోకేష్
ఇంటి స్థలం, గ్రూప్ వన్ ఉద్యోగం కూడా
క్రికెటర్ శ్రీచరణికి రూ2.5 కోట్ల చెక్కు(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ ప్రభుత్వం టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేసింది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో రాణించి, విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీచరణిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.. ఆమెకు నగదుతో పాటుగా ఇంటి స్థలం వంటి ప్రోత్సాహకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ను అందజేశారు. అంతేకాదు ప్రభుత్వం 500 గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలాన్ని కూడా కేటాయించింది. శ్రీచరణి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగం కూడా ఇవ్వనుంది. ఇటీవల ఏపీ కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ‘మహిళల వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ఉండవల్లి నివాసంలో అందజేశాను. ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు పాల్గొన్నారు’ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
తెలుగమ్మాయి శ్రీచరణి ఇటీవల నిర్వహించిన డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు ఢిల్లీ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలు కాగా.. ఆమెను ఢిల్లీ రూ.1.30 కోట్లతో ఢిల్లీ టీమ్లో చేరారు. టీమిండియా శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ టీమ్లోకి తెలుగమ్మాయిలు శ్రీచరణి కూడా ఎంపికయ్యారు. మరో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి కూడా స్థానం దక్కింది. ఈ టీ-ట్వంటీ సిరీస్ తొలి రెండు మ్యాచ్లు విశాఖపట్నంలోనే జరగనున్నాయి. శ్రీ చరణి సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె.. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో ఉద్యోగి. ఆమె స్పిన్ బౌలర్గా రాణిస్తూ టీమిండియాకు ఎంపికయ్యారు. ఉమెన్స్ వరల్డ్కప్లో తన బౌలింగ్తో అదరగొట్టారు. చరణి 9 మ్యాచ్ల్లో 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసి రాణించింది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి