సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు ప్రత్యేక రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు సర్వీసు జనవరి 9, 10, 18వ తేదీలలో అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ విజయవాడ ప్రత్యేక రైలు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6:10 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి మధ్యాహ్నం 2: 40 గంటలకు బయల్దేరుతుంది.

హైదరాబాద్ విజయవాడ ప్రత్యేక రైలు
07471 నంబరుతో హైదరాబాద్ – విజయవాడ మార్గంలో శుక్ర, శనివారాల్లో (జనవరి 9, 10)అదనపు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు హైదరాబాద్ నుంచి ఉదయం 6 గంటల 10 నిమిషాలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటా 40 నిమిషాలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. అలాగే విజయవాడ – హైదరాబాద్ మార్గంలో జనవరి 9, 18 తేదీలలో అదనపు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. విజయవాడ హైదరాబాద్ అదనపు ప్రత్యేక రైలు (07472) విజయవాడ నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు బయల్దేరుతుంది. రాత్రి 10 గంటల 35 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.. హైదరాబాద్ డెక్కన్ – విజయవాడ – హైదరాబాద్ డెక్కన్ రైలు (07471/07472) సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, ఘన్పూర్, ఖాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్ల మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలులో అన్ని జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ప్రత్యేక రైలు
అలాగే హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య జనవరి 9, 10వ తేదీలలో అదనపు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ రైలు (07469) ఉదయం 7 గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ మధ్య జనవరి 9, 18 వ తేదీలలో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ ప్రత్యేక రైలు ( 07470) సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు బయల్దేరుతుంది. రాత్రి 10 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
హైదరాబాద్ డెక్కన్ – సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ డెక్కన్ రైలు (07469/07470) సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘన్పూర్, ఖాజీపేట్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్ర ఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇందులో కూడా అన్నీ జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఏర్పాటు చేశారు.


