Chandrababu Meet Amit Shah On Amaravati: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు, అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేయాలని, విభజన చట్టంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఉపాధి హామీ, గృహ నిర్మాణం, రహదారులు వంటి కీలక రంగాలకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు.
హైలైట్:
- కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ
- అమరావతికి చట్టబద్దతపై అమిత్ షాకు రిక్వెస్ట్
- కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరిన చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పెంచాలని చంద్రబాబు కోరారు. ముఖ్యంగా గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, రెవెన్యూలోటును పూడ్చడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి, రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ (ఉద్యానవన) కేంద్రంగా తీర్చిదిద్దడానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, నిధులు విడుదల చేయాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలను బాగుచేయడానికి ఆర్థిక సాయం కోరారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందాలని, అనుమతులు కూడా త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి హోంశాఖ నుంచి తగినన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కేంద్రం చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు వివరించారు. తాను ఈరోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చానని, అక్కడి పనుల పురోగతి గురించి కూడా అమిత్ షాకు తెలియజేశారు. మరోవైపు చంద్రబాబు ఎల్జీ ప్రతినిధులతో కూడా సమావేశం అయ్యారు. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన కొత్త పరిశ్రమపై చర్చించారు.


