Nellore Outer Ring Road Rs 1930 Crores Proposal: నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా 83.64 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రూ.1930 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. పెన్నానదిపై వంతెనతో పాటు, పలు మండలాలను కలుపుతూ ఈ రోడ్డును నిర్మించనున్నారు. నెల్లూరు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
హైలైట్:
- ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు
- నెల్లూరుకు 83 కిలో మీటర్ల మే ORR
- ప్రతిపాదనలపై కలెక్టర్తో చర్చలు

నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది.. ఈక్రమంలో భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 83.64 కిలోమీటర్ల మేర నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో, 38 గ్రామాలను కలుపుతూ ఈ రోడ్డును నిర్మించనున్నారు. లేబూరు బిట్-2 దగ్గర మొదలై రాజుపాళెం జంక్షన్ దగ్గర పూర్తయ్యేలా దాదాపు రూ.1930 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
2023లోనే ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదన వచ్చిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించిన తర్వాత, అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో కోవూరు నియోజకవర్గంలో అత్యధికంగా 41.44 కిలోమీటర్లు, సర్వేపల్లిలో 20.94 కిలోమీటర్లు, నెల్లూరు రూరల్లో 19.64 కిలోమీటర్లు, ఆత్మకూరులో 1.02 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డులో భాగంగా పెన్నానదిపై 1200 మీటర్ల పొడవున ఒక బ్రిడ్జిని కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు నగరం చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.


