TTD Distribution Of SSD Tokens Commenced: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగియనున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లలో SSD టోకెన్ల జారీని టీటీడీ ఇవాళ పునఃప్రారంభించింది. భక్తులు ఈ టోకెన్లను తీసుకోవచ్చని తెలిపారు. అయితే గత 9 రోజుల్లో 7 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.69 కోట్లు వచ్చింది.
హైలైట్:
- తిరుమలలో నేటితో వైకుంఠ దర్శనాల ముగింపు
- నేటి నుంచి SSD టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
- శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లో జారీ

డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ దర్శనాలలో, మొదటి మూడు రోజులు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేసి వారికి దర్శనానికి అనుమతించారు. మిగిలిన ఏడు రోజులకు, నేరుగా ఆలయానికి వచ్చే సర్వదర్శనం భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే, ఎవరైతే నేరుగా వచ్చి క్యూలో నిలబడతారో వారికి ముందుగా దర్శనం కల్పించారు. అదే సమయంలో, పరిమిత సంఖ్యలో శ్రీవాణి టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా జారీ చేశారు. వీవీఐపీల బ్రేక్ దర్శనం, స్థానికులకు కూడా ఈ-డిప్లో రోజుకు ఐదు వేల చొప్పున టోకెన్లు ఇచ్చారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ, టీటీడీ అధికారులు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షించారు. ఈ కేంద్రం ద్వారా అన్ని ఏర్పాట్లను దగ్గరగా చూసుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించారు.
తిరుమలలో గడిచిన 9 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. రికార్డు స్థాయిలో 7,09,831 మంది భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం 85,752 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.69 కోట్లు వచ్చింది. కంపార్టమెంట్లు, షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టీటీడీ భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.
టీటీడీకి విరాళం
మరోవైపు తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన రాన్కి ఇన్ఫ్రా సంస్థ అధినేత ఆర్ యం ఈశ్వర్ నాయుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ అభినందించారు.


