ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సమయపాలన తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే ఆ రోజు వేతనంలో కోత విధిస్తారు. ఫేషియల్ హాజరు తప్పనిసరి చేస్తూ, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలు నిర్ణయించారు. ఈ నిబంధనలు సచివాలయ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగం అంటున్నారు అధికారులు. సిబ్బంది కచ్చితంగా ఈ నిబంధనను పాటించాలని చెబుతున్నారు.
హైలైట్:
- ప్రభుత్వం కీలక నిర్ణయం
- సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్
- లేట్గా వస్తే జీతం కట్

వైసీపీ ప్రభుత్వం 2019లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో సచివాలయంలో 11 నుండి 13 మంది వరకు సహాయకులను నియమించారు. గతంలో సచివాలయ ఉద్యోగుల విధులపై మాతృశాఖల అజమాయిషీ ఉండేది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనిని సరి చేసే ప్రయత్నం చేస్తోంది.
విజయనగరం జిల్లాలో 777 పంచాయతీలు ఉండగా, 626 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 5,781 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, సచివాలయ సిబ్బందిలో చాలా మంది సమయపాలన పాటించడం లేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నిషన్’ (Facial Recognition) హాజరును తప్పనిసరి చేసింది. సచివాలయ సిబ్బంది పని వేళలను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించింది. కచ్చితంగా ఈ సమయంలోనే సచివాలయ సిబ్బంది ఆన్లైన్ ద్వారా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. సమయానికి హాజరు వేయకుంటే ఆ రోజు వారు విధులకు రానట్లుగానే పరిగణించి, వేతనంలో కోత విధించేలా విధి విధానాలను రూపొందించింది.


