మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సైతం సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామని రోజా అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో రాజకీయ వ్యా్ఖ్యలను అందరూ మానుకుంటే మంచిదని రోజా అన్నారు. తాము మొదటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతున్నామన్నారు రోజా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని.. కేంద్ర దర్యాప్తు సంస్థ పర్యవేక్షణ ఉండాలని చెప్పిందన్న మంత్రి.. ఈ వాదనతో తమ డిమాండ్కు విశ్వసనీయత పెరిగిందన్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో అసలు నిజాలు బయటకు వస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు మాజీ మంత్రి. అటు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై టీడీపీ మరోలా స్పందించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. రాష్ట్ర అధికారులతో పాటు సీబీఐ, ఫుడ్ సేఫ్టీ అధికారులుతో కూడిన బృందం దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందనీ.. ఈ దర్యాప్తులో అసలు నిజాలు తేలుతాయని అభిప్రాయపడింది. జగన్ అండ్ కో పాపం పండిందన్న టీడీపీ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కొవ్వు నేతలు విచారణకు సిద్ధంగా ఉండాలని సెటైర్లు వేసింది.