
మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలోని 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలాల్లో చదువుతున్న విద్యార్థులకు, క్రీడల్లో ప్రోత్సాహం అందించారు పవన్ కళ్యాణ్. ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున, క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. . ఒక్కొక్క కిట్ దాదాపు 25 వేల రూపాయలు, మొత్తం కిట్ల కు 16 లక్షల రూపాయలు అవసరం ఉండటంతో, కిట్లకు అవసరమైన నిధులను CSR ఫండ్స్ ద్వారా సేకరిస్తామని జిల్లా కలెక్టర్ S. షాన్మోహన్ తెలియజేశారు.
పర్యావరణాన్ని రక్షించుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి వర్క్షాప్ను ప్రారంభించారు. పర్యావరణ హితం పరిశ్రమల బాధ్యత కావాలని.. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు.. భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించడం తమ బాధ్యత అన్నారు. జల, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణహిత పారిశ్రామికీకరణ ప్రస్తుత సమాజ అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు డిప్యూటీ సీఎం. అయితే వీలైనంత తక్కువ కాలుష్యం ఉండేలా వాటి ప్రణాళికలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పీసీబీ అంటే పరిశ్రమలకు వ్యతిరేకమనడం సరికాదని వ్యాఖ్యానించారు.
పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నారు పవన్ కళ్యాణ్. అలాగే కాలుష్య రహిత పరిశ్రమలు, వాటి విధివిధానాల రూపకల్పనకు నిపుణులు, మేధావులు విలువైన సూచనలు అందించాలి అన్నారు. రాబోయే ఐదేళ్లలో కాలుష్య నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ సూచనలు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలపై ప్రధానంగా చర్చ జరిగింది.

