Andhra Pradesh Govt Employees Retirement Age 65: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అంశంపై విద్యాశాఖ మౌలిక సదుపాయాల జేడీ మువ్వా రామలింగం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 62 ఏళ్లుగా ఉంది.. కాగా ఈ వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందని రామలింగం తెలిపారు. విద్యాశాఖలో ఒక ఉద్యోగి పదవీవిరమణ సభలో ఆయన ఈ బహిరంగ ప్రకటన చేశారు.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
- 62 నుంచి 65కు పెంచే అవకాశం ఉందంటున్నారు
- విద్యాశాఖకు చెందిన జేడీ రామలింగం చెప్పారు

ఇంతలో మువ్వ రామలింగం వ్యాఖ్యలపై ఓ స్కూల్ హెడ్మాస్టర్ స్పందించారు.. తమకు సర్వీసు వయసు ఇక చాలు సార్ అంటూ చెప్పుకొచ్చారు. తాము ఇప్పటికే శాఖాపరంగా ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నాము అన్నారు. వెంటనే స్పందించిన రామలింగం అలా అందరం చెబుతామని.. ఉద్యోగ కాలం పెరిగితే కొనసాగేందుకే ఇష్టపడతామన్నారు. తనవరకు మాత్రం మరో పదేళ్లయినా.. అంటే 72 ఏళ్ల వరకు పనిచేసేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు రామలింగం. మొత్తం మీద రాష్ట్ర విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ సెక్రటరీ మువ్వా రామలింగం రిటైర్మెంట్ వయసు పెంపుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లుగా ఉంది. గతంలో ప్రభుత్వం 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచిన సమయంలో ఉద్యోగుల్లో చర్చ జరిగింది.. భిన్న వాదనలు వినిపించాయి. మరి అలాంటిది ఒకవేళ రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచితే ప్రభుత్వ ఉద్యోగులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. అంతేకాదు ఒకవేళ పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ప్రభుత్వంలో కీలక అధికారి వయసు పెరిగే అవకాశం ఉందని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది.


