50 Electric Buses To Bhogapuram International Airport Soon:ఏపీకి త్వరలోనే విద్యుత్ బస్సులు పరుగులు తీయబోతున్నట్లు రవాణాశాఖమంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నానికి 100 విద్యుత్ బస్సులు వస్తాయని.. 50 బస్సుల్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు నడుపుతామని మంత్రి ప్రకటించారు. 50 ఎలక్ట్రిక్ బస్సుల్ని గాజువాక ఆర్టీసీ డిపోకు కేటాయిస్తామన్నారు. దూరం వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లు కచ్చితంగా ఉండాలని.. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
హైలైట్:
- ఏపీకి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు
- 100 బస్సులు విశాఖకు కేటాయింపు
- 50 బస్సులు భోగాపురం ఎయిర్పోర్ట్కు

విశాఖపట్నంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయినవారికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తామన్నారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 11 వేల బస్సులు నడుపుతున్నామన్నారు మంత్రి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు కలవరపెడుతున్నాయని.. ప్రమాదాలకు కారణాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామన్నారు. దూరం వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లను నియమించినట్లు తెలిపారు. గత ఆరు నెలలుగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలపై అధ్యయనం చేశామని.. ఇద్దరు డ్రైవర్లు లేని బస్సుల్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు బస్సు ఫిట్నెస్తో పాటు మనుషులు చేసే తప్పులే ఎక్కువ ఉన్నాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులతో పాటుగా బస్సుల్ని ఆపి డ్రైర్లకు నిద్రమత్తు రాకుండా ముఖం కడిగించే కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. సింహాచలం అప్పన్న ఆలయంలోఈ ఏడాది జరిగిన చందనోత్సవంలో మెరుగైన సేవలు అందించిన 20 మంది ఆర్టీసీ సిబ్బందికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందనే చర్చ జరుగుతోంది.. ఈ క్రమంలోనే ఆర్టీసీ అధికారులు 50 విద్యుత్ బస్సుల్ని భోగాపురం ఎయిర్పోర్ట్కు నడపాలని ప్లాన్ చేస్తున్నారు.


