India
oi-Lingareddy Gajjala
దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం అగ్నిప్రమాదం సంభవించింది. ఐటీఓ (ITO) పరిధిలో గల స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) క్యాంపస్లో సోమవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. క్యాంపస్ ఆవరణలో ఉన్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం (Ministry of Education’s office) రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.

ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం 9:37 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించిన అత్యవసర సమాచారం అందింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ టెండర్లను ప్రమాద స్థలానికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే ఫైర్ఫైటర్లు మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక చర్యలు పూర్తిగా ముగిసిన తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
