ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కాకినాడ జిల్లా తునిలో పర్యటించారు. తునిలోని చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు.. బటన్ నొక్కటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని.. కానీ, నేరుగా వచ్చి పింఛన్ అందించి, అధికారుల పనితీరును పర్యవేక్షిస్తే కలిగే ఆనందమే వేరని అభిప్రాయపడ్డారు.
హైలైట్:
- కాకినాడ జిల్లా తునిలో చంద్రబాబు పర్యటన
- పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
- బటన్ నొక్కటంపై కీలక వ్యాఖ్యలు

పేదల సేవలో పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెలా పింఛన్ల పంపిణీని చేపడుతున్నారు. రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూ పేద ప్రజలకు పింఛన్లు అందిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో పర్యటించారు చంద్రబాబు నాయుడు, చామవరంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు బటన్ నొక్కటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని.. కానీ, నేరుగా పేదవాడి ఇంటికి వచ్చి పింఛన్ అందించినప్పుడు, అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించినప్పుడు కలిగే ఆనందం.. బటన్ నొక్కితే ఉండదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
గతంలో ఏదైనా కారణంతో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే.. వెంటనే రద్దు చేసేవారని చంద్రబాబు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి 3 లేదా 4 సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామని వివరించారు. పీ4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందన్న చంద్రబాబు.. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వంపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.


