Andhra Pradesh
oi-Syed Ahmed
వేసవి తాపం, వడగాల్పులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ విభాగం ఇవాళ చల్లని వార్ల చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్ధితులు అనుకూలంగా మారుతుండటంతో భారీ వర్షాలు (heavy rains) పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో ఏ విధంగా వర్షాలు కురుస్తాయో కూడా వెల్లడించింది. అలాగే పలు జిల్లాలకు ఉరుములు, పిడుగుపాట్లు కూడా ఉంటాయని తేలడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు చేస్తోంది. ఇందులో విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ కూడా జారీ చేసింది. అంటే ఇక్కడ భారీ వర్షాలతో పాటు ఉరుములు, పిడుగుపాట్లు కూడా ఉంటాయని తెలిపింది. కాబట్టి ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం కోరుతోంది.

మరో 48 గంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. దక్షిణ కోస్తాలో వడగాలుల తీవ్రత కూడా తగ్గనుంది. దీని స్ధానంలో ఈదురు గాలులు మొదలవుతాయి. రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ విభాగం హెచ్చరికలు చేస్తోంది. రుతుపవనాలు వచ్చే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అంచనా వేస్తోంది.

