ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే సందర్బంగా నిర్వహించిన కవాతు వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శకటాల ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. ఈ శకటాల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ శకటానికి స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఏటికొప్పాక బొమ్మలపై అందరి దృష్టి పడింది. ప్రధాని మోదీని సైతం ఈ బొమ్మలు ఆకర్షించాయి.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామస్థులు వందల ఏళ్లుగా ఈ బొమ్మలను తయారుచేస్తున్నారు. వీటికి జీఐ ట్యాగ్ కూడా లభించింది. అంకుడు కర్రతో ఈ బొమ్మలను తయారు చేస్తారు. అంకుడు కర్రను ఉపయోగించడం ద్వారా ఈ బొమ్మలకు అంత నునుపుదనం, మృదుత్వం వస్తుంది. 400 ఏళ్లుగా ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారు. ఈ చేతివృత్తి కళాకారుల నైపుణ్యం ఎంత గొప్పదంటే ఏటికొప్పాక లక్క బొమ్మలను ఎక్కడ తాకినా సరే.. గుండ్రంగా, నునుపుగా ఉంటుంది. అలాగే ఎక్కడా కూడా పదునైన అంచులు వంటివి ఉండవు. అంతటి అద్భుత ప్రతిభ వీరి సొంతం. పౌరాణిక పాత్రలు, సంగీత వాయిద్యాలు, గృహాల అలంకరణల బొమ్మలు, జంతువుల బొమ్మలు వీరి చేతుల మీదుగా ప్రాణం పోసుకుంటున్నాయి.
ఇక ఏటికొప్పాక బొమ్మల తయారీకి అంకుడు చెట్లనే ఎందుకు ఉపయోగిస్తారంటే.. దీని మృదువైన, సున్నితంగా ఉండే కలప.. బొమ్మలను చెక్కడానికి అనువుగా ఉంటుంది. అలాగే తక్కువ బరువు కలిగి ఉంటుంది. పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ కలిగించవు. అంకుడు చెట్ల నుంచి కర్రను సేకరించి తొలుత చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఆ తర్వాత తమకు కావాల్సిన ఆకారంలో దానిని చెక్కుతారు. ఆపై సహజసిద్ధమైన రంగులను అద్ది.. ఏటికొప్పాక బొమ్మలకు ప్రాణం పోస్తున్నారు ఇక్కడి కళాకారులు. ఈ రంగులను కూడా చెట్ల నుంచే సేకరిస్తారు. విత్తనాలు, ఆకులు, బెరడు వంటి వాటిని ఉపయోగించి సహజంగా ఈ రంగులను తయారుచేస్తారు.
ప్రస్తుతం ఈ ఏటికొప్పాక బొమ్మలు దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. 2017లో ఏటికొప్పాక బొమ్మలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా లభించింది. ఆ రకంగా ఏటికొప్పాక బొమ్మలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి, ఏపీ కళాకారుల పర్యావరణ అనుకూల సృజనాత్మకత, సాంస్కృతిక వారసత్వానికి పర్యాయపదంగా మారాయి.


