Trust Board To Meet: ఈనెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ సభ్యులు, అధికారులతో పాలక మండలి సమీక్షించనున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. భక్తులకు సౌకర్యాలపై అధికారులకు టీటీడీ ఛైర్మన్ సూచనలు చేయనున్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. తిరుపతి ఘటన దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని.. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దుపై టీటీడీ ఇప్పటి ప్రకటన చేసింది.
హైలైట్:
- ఈ నెల 31న టీటీడీ పాలకమండలి భేటీ
- అత్యవసరంగా సమావేశమవుతున్న బోర్డ్
- రథసప్తమి వేడుకలపై చర్చించనున్నారు

తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు
కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరుగనున్నాయి. మొదటిరోజైన జనవరి 28న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురందర సాహిత్య గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు ప్రముఖ పీఠాధిపతులు మంగళా శాసనములు అందిస్తారు.
రెండవ రోజైన జనవరి 29న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. చివరిరోజు జనవరి 30న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 28న తిరుపతిలో “హరిదాస రంజని”.. జనవరి 28న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో “హరిదాస రంజని” గోష్టిగానం నిర్వహించనున్నారు.
శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 28 నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7.15 నుంచి 8.15 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 7న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 13న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 17న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.


