Pawan Kalyan Letter To Janasena Followers: ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ.. ఎన్డీఏ కూటమి అంతర్గత విషయాలపై కానీ.. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా వారి వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పొద్దన్నారు.
హైలైట్:
- జనసైనికులకు, వీర మహిళలకు పవన్ కళ్యాణ్ లేఖ
- మూడు పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు
- బహిరంగంగా చర్చించొద్దని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

‘ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికార౦ చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధి౦చే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికార౦ చేపట్టిన 7 నెలల కాల౦లో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నా, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన
జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని – అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నా సరే దానంతటికి కారణ౦ 5 కోట్ల ఆ౦ధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే ధృఢ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది’ అన్నారు.
‘అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరూ కూడా ప్రతి స్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కానీ, బహిర౦గ౦గా చర్చించడ౦ కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆ౦ధ్ర సాధించి, వికసిత్ భారత్ సాధనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసర౦ ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను, నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం, నేను పుట్టిన నేలను అభివృద్ది చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చి 14 న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను’అన్నారు పవన్ కళ్యాణ్.


