Andhra Pradesh Budget Matsyakara Bharosa Scheme Allocations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ పథఖాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. అంతేకాదు మత్స్యకారులకు కూడా తీపికబురు చెప్పారు. మత్స్యకారులకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున అందిస్తామన్నారు.
హైలైట్:
- ఏపీ బడ్జెట్లో మరో పథకానికి నిధులు
- ఒక్కొక్కరికి రూ.20వేలు ఇస్తారు
- ముందుగానే నిధులు విడుదల

రూ. 97.09 కోట్లతో పనులను చేపట్టనున్నామన్నారు. అలాగే అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మొత్తం 1,22,968 మంది మత్స్యకారులకి కుటుంబానికి రూ.20వేలు చొప్పున రూ.245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నామని ప్రకటించారు. PMMSY పథకం కింద 15 తీరప్రాంత మత్స్యకారుల గ్రామాలను వాతావరణ మార్పుని తట్టుకుని సుస్థిర అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి రూ.30 కోట్లతో ప్రతిపాదించామన్నారు. డీజిల్ ఆయిల్ సబ్సిడీపై 2024-25సంవత్సరంలో రూ.50 కోట్లు ఖర్చు చేయటం ద్వారా 28,058 యాంత్రిక, మర బోట్లకు ప్రయోజనం దక్కిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు రూ.9.90 కోట్లు కూడా చెల్లించామన్నారు. ఈ పథకం కోసం 2025-26 సంవత్సరంలో రూ. 50 కోట్లు ప్రతిపాదించామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు చనిపోతే.. వారి కుటుంబాలకు బకాయి పడిన రూ.3.15 కోట్లు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2025-26కు రూ.8 కోట్లు ప్రతిపాదించామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి రూ.1.50 పైసలు /యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఆక్వా & నాన్ ఆక్వాజోన్లలో అర్హత కలిగిన 68,134 ఆక్వా సర్వీప్ కనెక్షన్లకు ఈ సదుపాయం విస్తరించడానికి చర్యలు చేపట్టామన్నారు. PMMSY పథకం కింద 2025-26లో మొత్తం రూ. 417 కోట్లు ప్రతిపాదించామన్నారు. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగం అభివృద్ధికి రూ. 510. 189 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు.
‘ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించాము. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాము. వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నాము. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


