Vijayawada Rtc Bus Money Seized: విజయవాడలో ఆర్టీసీ బస్సులో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు వెంటనే బస్సును ఆపి తనిఖీలు చేశారు. అయితే బస్సులో మహిళ హ్యాండ్బ్యాగ్ మాత్రం దొరక లేదు. కానీ ఓ వ్యక్తి దగ్గర బ్యాగ్లో చెక్ చేస్తే భారీగా డబ్బులు దొరికాయి. ఆ డబ్బులకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు.
హైలైట్:
- విజయవాడలో ఆర్టీసీ బస్సులో చెకింగ్స్
- మహిళ బ్యాగ్ కోసం వెతికిన పోలీసులు
- బస్సులో భారీ కరెన్సీ కట్టలు దొరికాయి

ఆ ఇద్దరు వ్యక్తులు మచిలీపట్నం వెళ్తున్న బస్సులో ఉన్నట్లు గుర్తించి బస్ స్టేషన్ ఔట్పోస్ట్ పోలీసులు కృష్ణలంక పోలీసులను అప్రమత్తం చేశారు. వారు వెంటనే నేషనల్ హైవేపై ఫైర్స్టేషన్ కూడలి సమీపంలో మచిలీపట్నం వెళ్తున్న బస్సును ఆపారు. వెంటనే బస్సులోకి వెళ్లి తనిఖీలు చేపట్టగా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పోలీసుల సోదాల్లో మహిళ పొగొట్టుకున్న బ్యాగ్ మాత్రం దొరక్కపోగా.. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఒకరి దగ్గర బ్యాగులో రూ.44.25 లక్షల డబ్బులు దొరికాయి. కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో ఆ డబ్బుల్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
బస్సులో డబ్బులతో లున్న వ్యక్తి పేరు వడ్డి సారథి.. ఆయన మచిలీపట్నంలో నగలు తయారు చేస్తుంటానని పోలీసులతో చెప్పారు. తాను విజయవాడలో గోల్డ్ బిస్కెట్ విక్రయించానని.. ఆ డబ్బుల్ని మచిలీపట్నం తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఆ వ్యక్తిని డబ్బులకు సంబంధించిన డాక్యుమెంట్లు అడిగామని.. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే ఆ డబ్బుల్ని తీసుకెళ్లి ఐటీ అధికారులకు అప్పగిస్తామన్నారు. ఇదిలా ఉంటే హ్యాండ్బ్యాగ్ పోగొట్టుకున్న మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలోని బస్స్టేషన్లో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మహిళ తన హ్యాండ్ బ్యాగ్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. బస్సులో ఆ బ్యాగ్ కనిపించకపోగా.. ఈ డబ్బుల బ్యాగ్ దొరికింది. ఈ ఘటన విజయవాడలో చర్చనీయాంశమైంది.


