విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఓబుళాపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్డు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఇక పోసాని కృష్ణ మురళి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వర్గాలు, కులాలపై తాను తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పోసాని అంగీకరించారని సమాచారం. వైసీపీకి చెందిన ముఖ్య నేత సూచనల మేరకే విమర్శలు చేశానని పోసాని పోలీసులతో చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.

మరోవైపు రాజకీయ పార్టీలు, అభిమానులు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మార్చి 12 వరకు పోసాని కృష్ణ మురళి రాజంపేట సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోసాని కృష్ణ మురళిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోసానిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే పోలీసుల పిటిషన్ను రైల్వే కోడూరు కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఇందులో నాలుగు కేసులలో పోసాని కృష్ణ మురళికి వ్యతిరేకంగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు పోసాని కృష్ణ మురళిని బుధవారం హైదరాబాదులో అరెస్టు చేసిన సమయంలో అరెస్ట్ ఇంటిమేషన్ కాపీని పోసాని కృష్ణ మురళి కుటుంబ సభ్యులు తీసుకోలేదు. దీంతో పోసాని కృష్ణ మురళి తనయుడికి అరెస్ట్ ఇంటిమేషన్ కాపీని వాట్సాప్ ద్వారా పంపించినట్లు పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు తెలిపారు.


