ఏపీలో రేపటి నుంచి కొత్త మోటార్ వాహనాల చట్టం అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించనున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడపటం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అతి వేగం, సిగ్నల్ జంపింగ్ వంటి సమయాల్లో భారీగా జరిమానాలు విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించేలా చూడాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టం అమల్లోకి తేనున్నారు.

వీటితో పాటుగా అతి వేగం, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి కేసులలో వేయి రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే రూ.5000 జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు లోబడి నడుచుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు కోరుతున్నారు.
మరోవైపు ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ విషయంలో ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లపై ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ నిర్వహించింది. ఈ తరహా ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు. హెల్మెట్ ధరించి ఉంటే బాధితుల్లో ఎక్కువ శాతం మంది బతికి ఉండేవారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. అలాగే మోటార్ వాహనాల చట్టాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్నారు.


