Kasibugga Flyover: ఏపీలో రైల్వేగేట్లతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎట్టకేలకు మోక్షం దక్కనుంది. ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంతో రాకపోకల సమయంలో పడుతున్న కష్టాల నుంచి గట్టెక్కనున్నారు. జాతీయ రహదారి ఆధునికీకరణ జరిగినప్పటికీ వీటి నుంచి మోక్షం దక్కలేదు. ముఖ్యంగా పలాస నియోజకవర్గాల పరంగా కొన్ని ప్రధాన రైల్వే గేట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కాశీబుగ్గ ఫ్లై ఓవర్కు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది.. రూ.46.64 కోట్లు ఇస్తున్నారు.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త ఫ్లై ఓవర్
- రూ.46.64 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన
- కేంద్రమంత్రి రామ్మోహన్ చొరవతో

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాశీబుగ్గ, బెండి రైల్వే ఫ్లైఓవ ర్ బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు.. కానీ నిర్మించలేకపోయారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం బెండి బ్రిడ్జిని పూర్తి చేసి ప్రారంభించారు. కాశీబుగ్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి కొన్ని సమస్యలతో పూర్తి చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో సగం పూర్తి చేయగా.. ఆ పనులు ఆగిపోయాయి. అలాగే నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం, నిర్వాసితుల సమస్యలు తేలకపోవడంతో వ్యయం పెరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలాస ఎమ్మెల్యే శిరీష ఫ్లై ఓవర్ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వేమంత్రి అశ్వనివైష్ణవ్కు వినతిపత్రం అందించి మాట్లాడారు. వెంటనే సానుకూలంగా స్పందించిన రైల్వేమంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రైల్వేశాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు.. తాజాగా రూ. 46.64 కోట్లకు లైన్ క్లియర్ చేశారు. ఈ ఫ్లై ఓవర్ పనులు త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ఫ్లై ఓవర్ కోసం నిధులు విడుదల చేసినందుకు పలాస నియోజకవర్గ ప్రజల తరుపున రైల్వే మంత్రి, పౌరవిమానయానశాఖ మంత్రికి ఎమ్మెల్యే గౌతు శిరీష ధన్యవాదాలు తెలిపారు. ఈ బ్రిడ్జి లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బుందులు ఎదురవుతున్నాయని స్థానికులు అంటున్నారు. అక్కడ రైల్వే గేటు వేశారంటే కనీసం 45 నిమిషాలు ఇబ్బందిపడాలి అంటున్నారు. మొత్తానికి బ్రిడ్జికి మోక్షం లభించిందని స్థానికులు అంటున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరుతున్నారు.


