గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను మొదలుపెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి.. గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ అవార్డుల కమిటీకి ఛైర్మన్గా బి.నర్సింగరావు, వైస్ ఛైర్మన్గా నిర్మాత దిల్ రాజును నియమించింది. అలాగే కమిటీ సలహాదారులుగా రాఘవేంద్రరావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరిణి, దగ్గుబాటి సురేష్ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణుతో పాటు ఎఫ్డీసీఎండీ మెంబర్ కన్వీనర్గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఎఫ్డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించినా టాలీవుడ్ నుంచి తమను ఎవరూ సంప్రదించలేదని సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్తో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రంగంలోకి దిగాయి. గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో చర్చించి, విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశాయి. ఆ నివేదికల ఆధారంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్తో పాటు, కమిటీ సభ్యులను ఎంపిక చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..