
హైదరాబాద్ పాతబస్తీ ఖులీ కుతుబ్షాహీ స్టేడియంలో బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఢిల్లీకి చెందిన సల్మాన్ దిల్లీవాలా గ్యాంగ్ మరోసారి ప్రజలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జడిబుడి పేరిట ఈ స్కామ్కు తెరలేపారు. తలపై జుట్టు రావడం ఖాయమంటూ రెండు రోజుల పాటు ప్రచారం దంచారు. శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున జనం గుండు చేయించుకుని పాతబస్తీలోని స్టేడియానికి చేరుకున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం రూ.700.. నూనె తలకు రాసేందుకు మరో రూ.600 చొప్పున ఒక్కో వ్యక్తి వద్ద నుంచి మొత్తం రూ.1300 వసూలు చేశారు. చెట్టు నుంచి తయారుచేసిన ప్రత్యేక నూనెను తలపై రాస్తే మూడు నెలల్లో ఒత్తయిన జుట్టు వస్తుందని నమ్మబలికారు. సామాజిక మాధ్యామాల్లో ప్రచారం చేయడంతో రెండు రోజుల్లోనే 5,000-6,000 మంది ఈ శిబిరానికి హాజరయ్యారు.
గతంలో ఇదే సల్మాన్ గ్యాంగ్ ఉప్పల్, పాతబస్తీ ప్రాంతాల్లో కూడా ఈ తరహా మోసాలు చేసింది. అప్పుడు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుని కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ పాతబస్తీలో శిబిరం నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే ఈ వ్యవహారంపై మాకు సమాచారం వచ్చింది. తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ఈ ఘటనపై స్పందించిన హుస్సేనిఆలం పోలీసులు తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. ధృవీకరించని వైద్య పద్ధతులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.