ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇళ్ళు అమ్మకానికి పెట్టాడు ఓ వ్యక్తి. అందుకు అంగీకరింలేదని వృద్ధురాలైన కన్నతల్లిని బస్టాండ్లో వదిలి వెళ్లాడు కన్నకొడుకు. అయితే ఒంటరిగా కనిపించిన వృద్ధురాలిని చేరదీసి ఆశ్రయం కల్పించారు జిల్లా పోలీసులు.
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పార్వతమ్మ, రామకృష్ణ దంపతులకు ఇద్దరు మగ సంతానం. రామకృష్ణ హోటల్ లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. పిల్లలు ఇద్దరు భవన నిర్మాణ పనులు నేర్చుకుని మేస్త్రీలుగా మారారు. ఇరువురికి పెళ్ళిళ్ళు సైతం చేశారు. పెద్దవాడు హైదరాబాద్లో, చిన్నవాడు వనపర్తిలోనే వేరువేరుగా కాపురం పెట్టుకున్నారు. ఇక వృద్ధ దంపతులు వనపర్తిలోని స్వంత నివాసంలోనే జీవనం సాగిస్తున్నారు. గడచిన కొన్ని రోజుల క్రితం పార్వతమ్మ అనారోగ్యానికి గురైంది. కాళ్ళ నొప్పుల కారణంగా నడవడానికి సైతం ఇబ్బందులు పడుతోంది. అయితే, తల్లిదండ్రుల పేరుమీద ఉన్న ఇళ్ళు కోసం ఇద్దరు కుమారులు మానవత్వాన్ని మరిచిపోయారు. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిపై కర్కశం ప్రదర్శిస్తున్నారు.
తమ అవసరాల కోసం తల్లిదండ్రుల ఇల్లు అమ్మాలని ఇద్దరు అన్నదమ్ములు ప్లాన్ వేశారు. గడచిన కొన్ని నెలలుగా ఇళ్లు కొనుగోలు చేసే వారిని తీసుకువచ్చి బేరం సైతం పెడుతుండగా తల్లి పార్వతమ్మ అడ్డుపడుతూ వస్తోంది. అయితే తాజాగా 8 లక్షల రూపాయలకు ఓ వ్యక్తికి ఇళ్ళు అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీనికి మరోసారి తల్లి పార్వతమ్మ అడ్డు చెప్పింది. దీంతో ఆగ్రహించిన పెద్ద కుమారుడు భాస్కర్ కన్నతల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇదే అదునుగా ఇంట్లో తండ్రి లేని సమయం చూసి తల్లికి వైద్యం అందిస్తామని చెప్పి ఇంటికి తాళం వేశాడు కుమారుడు భాస్కర్. తీరా ఆత్మకూరు బస్సు ఎక్కించి బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయాడు. కడుపు చించుకుని పుట్టిన కుమారుడు ఇంత ఘోరానికి పాల్పడతాడని ఆ అమాయక తల్లి ఊహించలేదు.
గడిచిన రెండు రోజులుగా కుమారుడు వస్తాడేమోనని బస్టాండ్లోనే పిచ్చిదానిలా ఎదురుచూస్తోంది తల్లి పార్వతమ్మ. అయితే వృద్ధురాలిని గమనించిన స్థానికులు ఆమె వివరాలు ఆరా తీశారు. కుమారుడు భాస్కర్ ఫోన్ నెంబర్ తీసుకుని సమాచారం ఇచ్చారు. ఆయన నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్వతమ్మను పూర్తి వివరాలు తెలుసుకోగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విషయాన్ని భర్త రామకృష్ణకు చెప్పడంతో ఆత్మకూరుకు వచ్చి భార్యను తీసుకెళ్లాడు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
పార్వతమ్మ దీన గాథ తెలుసుకున్న వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ స్పందించారు. ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ నరేందర్ కు ఆదేశాలు ఇచ్చారు. పార్వతమ్మ కు సహాయం చేయాలని కోరారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతమ్మను స్వంత ఖర్చులతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందించాలని సీఐ శివకుమార్, ఎస్సై నరేందర్ నిర్ణయించారు. మరోవైపు కుమారుల అరాచకంపై వనపర్తి పోలీసులకు తండ్రి రామకృష్ణ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..