ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ సర్కార్.. తాజాగా బస్సుల్లో సాంకేతికను పెంచే అంశంపై దృష్టి పెట్టింది. త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి వై-ఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బస్సుల్లో ఇంటర్నెట్ సేవలు అందించడంపై ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఆర్టీసీకి ప్రతిపాదనలు అందజేసింది. ఈ ప్రతిపాదనలపై ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అందించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై-ఫై సదుపాయాలను అందించాలని ప్రైవేటు సంస్థ ప్రతిపాదించింది. ఇది సాధారణ ఇంటర్నెట్ యాక్సెస్ కాకుండా.. ముందుగా సెలక్ట్ చేసిన సినిమాలు, సాంగ్స్ వంటి కంటెంట్ను ప్యాసింజర్స్ తమ మొబైళ్లలో చూసేలా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వై-ఫై ద్వారా అందించే కంటెంట్ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూరుతుందని.. అందులో భాగస్వామ్యంతో ఆర్టీసీకి కూడా ఆర్థిక ప్రయోజనం ఉంటుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రతిపాదనలపై మరింత స్పష్టత కోసం త్వరలో ఆ సంస్థ, ఆర్టీసీ మధ్య మరో మీటింగ్ జరగనుంది. ఆ సమావేశం అనంతరం ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యచరణ రూపొందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతం అవుతుందని.. ప్రయాణికులు తక్కువ ధరలో వినోదాన్ని ఆస్వాదించగలరని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి