Guntur To Guntakal New Railway Line,ఏపీలో కొత్తగా రెండో రైల్వే లైన్.. ఈ రూట్లో రూ.3,631 కోట్లతో, ఈ రెండు జిల్లాలకు మహర్దశ – guntakal to guntur railway line doubling works speed up in nallamala forest
Guntur To Guntakal Doubling Railway Line: రాయలసీమ వాసులకు శుభవార్త! గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో చిక్కుముడులు వీడటంతో ఏళ్ల తరబడి నిలిచిన పనులు మళ్ళీ మొదలయ్యాయి. సొరంగాలు, వంతెనల నిర్మాణం పూర్తయితే రైళ్ల రాకపోకలు సులువు అవుతాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్గంలో వందే భారత్ రైళ్లు కూడా పరుగులు తీసే అవకాశం ఉంది అంటున్నారు.
హైలైట్:
ఏపీలో మరో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు
నల్లమల అటవీ ప్రాంతంలో వేగవంతం
రెండు భారీ సొరంగాలు నిర్మించనున్నారు
గుంటూరు నుంచి గుంతకల్లు డబ్లింగ్ పనులు (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలవారికి తీపికబురు. గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ (కొత్తగా రెండో రైల్వే లైన్) పనులు వేగంగా జరుగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని దిగువమెట్ట-నంద్యాల మధ్య డబ్లింగ్ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆరు నెలల క్రితం అనుమతులు ఇవ్వడంతో.. ఏడేళ్ల తర్వాత నల్లమల అటవీ ప్రాంతాల్లో సొరంగాల నిర్మాణం మొదలైంది. 2027 నాటికి పనులు పూర్తి చేయాలనే టార్గెట్గు పనులు చేస్తున్నారు. గుంటూరు-గుంతకల్లు రైలు మార్గంలో ప్రస్తుతం 24 ఎక్స్ప్రెస్ రైళ్లు, మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ రూట్లో ఒకే లైన్ ఉండటంతో కొన్ని రైళ్లు స్టేషన్లలో ఆగాల్సి వస్తోంది. అదే కనుక డబ్లింగ్ పనులు పూర్తయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. వందేభారత్ వంటి రైళ్లు కూడా వెళ్లొచ్చంటున్నారు. గుంటూరు-గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ పనులకు సంబంధించి నల్లమల అడవిలోని రెండు పెద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. వీటిలో దిగువ మెట్ట-చలమ దగ్గర ఈ రెండు పెద్ద వంతెనలు ప్లాన్ చేశారు. ఈ బ్రిడ్జిల కోసం భూసేకరణ పనులు పూర్తికాగా.. అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. దొరబావి బ్రడ్జి దాటిన తర్వాత ఒక పెద్ద వంతెనను నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి దగ్గరలో ఉన్న వాగుపై మరో వంతెన కట్టాల్సి ఉంది.. ఈ పనులు త్వరలో ప్రారంభించనున్నారు. 2018లో గుంటూరు-గుంతకల్లు (426 కి.మీ.) రైలు మార్గం డబ్లింగ్ పనులు మూడు భాగాలుగా విభజించి ప్రారంభించారు. ఈ పనుల కోసం రూ.3,631 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నల్లపాడు-దొనకొండ మధ్య పనులను గుంటూరు రైల్వే డివిజన్కు, దొనకొండ-నంద్యాల మధ్య పనులను సికింద్రాబాద్ రైల్వే డివిజన్కు, గుంతకల్లు-నంద్యాల మధ్య పనులను గుంతకల్లు రైల్వే డివిజన్కు అప్పగించారు. అయితే ఈ రూట్లో ఇప్పటి వరకు 347 కి.మీ. మేర పనులు పూర్తి చేయగలిగారు.
ఏపీలో కొత్తగా రెండో రైల్వే లైన్.. ఈ రూట్లో రూ.3,631 కోట్లతో, ఈ రెండు జిల్లాలకు మహర్దశ
ఈ రూట్లోని నంద్యాల-దొనకొండ మధ్య అటవీ ప్రాంతంలో పనులు ప్రారంభించాల్సి ఉంది. అటవీ శాఖ అనుమతులు రావడంతో ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో పనుల్ని మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్లో నల్లమల అడవిలో ఉన్న దిగువమెట్ట-నంద్యాల మధ్య జరిగే డబ్లింగ్ పనులే ముఖ్యం అంటున్నారు. ఈ ప్రాంతంలోని అభయారణ్యంలో పులులు ఉంటాయి.. మొత్తం 28 కి.మీ. పొడవునా డబ్లింగ్ పనులు చేయాలి.. రెండు సొరంగాలు నిర్మించాల్సి ఉంది. అందుకే ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో ఈ సొరంగాల నిర్మాణం చేపట్టారు. ఈ మేరకు ఈ పనుల కోసం జంబో డ్రిల్లింగ్ యంత్రం వెళ్లేందుకు కొండను యంత్రాలతో తొలచి చదును చేశారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి