ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరితో పాటు స్థానిక జనం కూడా జగన్ను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ప్రమాదానికి గురై వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధినే వైఎస్ జగన్ సంగయ్య మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యకర్త లింగయ్య కుటుంబానికి అండగా ఉండాలని, వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
అధినేత ఆదేశాలతో పార్టీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలేనికి వెళ్లి కార్యకర్త సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. తమ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.
ఇక ఈ సందర్బంగా మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సింగయ్య మృతి చెందిన విషయం తెలిసి అధినేత జగన్ ఎంతో బాధపడ్డారని.. సింగయ్య కుటుంబానికి అండగా ఉండమని చెప్పడంతో పాటు.. పార్టీ తరపున వారి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందజేయాలని చెప్పినట్టు అంబటి రాంబాబు తెలిపారు. కానీ సింగయ్య మృతుని కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసిందని ఆరోపించారు. జగన్ పర్యటనలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని..వారు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ భయపడేవారెవరూ లేరని అంబటి అన్నారు. జగన్ పర్యటనకు ప్రజలను రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..