Chandrababu Naidu Yoga Journey: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన ఫిట్నెస్కు హెల్దీ ఫుడ్తో పాటుగా మరో సీక్రెట్ కూడా ఉందని మీకు తెలుసా.. ఆయన ఈ వయసులోనూ ఇంత యాక్టివ్గా ఉన్నారంటే కారణం యోగానే అని ఎంతమందికి తెలుసు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి నేటి వరకు యోగాను ప్రోత్సహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- 75 ఏళ్ల వయసులోనూ నవయువకుడిలా చంద్రబాబు
- హెల్దీ ఫుడ్ మాత్రమే కాదు మరో సీక్రెట్ కూడా ఉంది
- ఏపీ సీఎం జీవితంలో యోగాకు ఉన్న ప్రాధాన్యం ఏంటి

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాకు ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటే నమ్ముతారా.. ఈ మాట చెబితే కొంత మందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ, చంద్రబాబును దగ్గరి నుంచి చూసినవారికి, ఆయన గురించి తెలిసినవారికి యోగాకు ఆయన చేసిన సేవ ఏంటో తెలుస్తుంది.
చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది.. ఓవైపు పార్టీ, కార్యకర్తల మంచిచెడులు చూసుకుంటూనే.. మరోవైపు పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉంటారు. ప్రతి రోజూ ఎన్నో రకాల ఒత్తిడి, శారీరక శ్రమ కచ్చితంగా ఉంటుంది.. వీటన్నిటిని తట్టుకుని చంద్రబాబు ఒక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు. ఆయనకు ప్రస్తుతం 75 ఏళ్లు.. ఎప్పుడూ చాలా యాక్టివ్గా కనిపిస్తుంటారు. అందుకే ఆయన పదే, పదే తన ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తుంటారు.. ఆయన తీసుకునే జాగ్రత్తల్ని చెప్తుంటారు. చంద్రబాబు హెల్త్ సీక్రెట్లలో యోగా కూడా ఒక భాగమని మీకు తెలుసా.. అవును చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒక్కమాటలో చెప్పాలంటే యోగా ఒక అలవాటు కాదు ఆయన జీవితంలో ఒక భాగంగా మారింది.
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఒత్తిడి మాత్రం తప్పదు.. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకోవడానికి యోగా, ధ్యానం ఎంతో సహాయపడ్డాయని ఎన్నోసార్లు చెప్పారు. అందుకే ఆయన యోగా చేయడమే కాదు ప్రజలు కూడా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవాలని ప్రస్తావిస్తుంటారు. ఆయన చెప్పడం కాదు.. నిజ జీవితంలో కూడా ఆచరిస్తున్నారు. నిత్య విద్యార్థి అన్నట్లుగా ఆయన యోగా గురించి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వేకువజామునే యోగా, ధ్యానం చేయడం ఆయన జీవితంలో ఒక భాగమైంది. మానసిక ప్రశాంతతో పాటుగా ఏకాగ్రత కోసం యోగా చేయడం అలవాటు. తన జీవితంలో యోగాతో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఒక క్రమశిక్షణకు అలవాటుపడ్డానని చెబుతుంటారు. చంద్రబాబు ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉండటానికి యోగా, వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారం ప్రధాన కారణమని సతీమణి భువనేశ్వరి కూడా గతంలో ప్రస్తావించారు. ప్రతి రోజూ గంటన్నర నుంచి రెండు గంటల పాటూ యోగా, ధ్యానం, వ్యాయామాలు చేస్తుంటారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యోగాను బాగా ప్రోత్సహించారు. యోగా ప్రాముఖ్యతను 30 ఏళ్ల క్రితమే గుర్తించారని మీకు తెలుసా.. అవును మీరు వింటున్నది నిజమే. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఎన్టీఆర్ భవన్లో 1994లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, పార్టీ నేతలకు నిపుణులతో యోగా, ధ్యానంలో శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 2014 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రతి ఏటా యోగాకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్, ఇషా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురు జగ్గీ వాసుదేవ్ల సహాకారంతో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో శిక్షణా తరగతుల్ని కూడా నిర్వహించారు. 2014-2019 మధ్య ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక యోగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.
చంద్రబాబును 2023లో అరెస్టైన తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.ఆ సమయంలో జైల్లో కూడా క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేసేవారని చెబుతుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి ఏటా యోగా దినోత్సాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరు యోగా డే రోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాదు విద్యా సంస్థల్లో యోగాను తప్పనిసరి చేయాలనే ఆలోచన కూడా ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. విద్యార్థులకు 9వ తరగతి నుంచి యోగాను తప్పనిసరి చేయాలని సూచించారు. భవిష్యత్లో యోగాను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చడంపై తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయన్నారు. యోగా మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుందని.. క్రమశిక్షణతో పాటుగా ఏకాగ్రత, మానసిక బలం, ఒత్తిడిని జయించడం, సంక్లిష్ట పరిస్థితుల్ని సమర్థవంతం ఎదుర్కోవడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి యోగా ఎంతో సహాయపడుతుందని చెబుతుంటారు. యోగా ఒక మతానికి సంబంధించినది కాదు.. అది ఒక శాస్త్రీయ విధానమని చంద్రబాబు పదే, పదే చెబుతుంటారు. యోగా మన దేశానికి గొప్ప వరమని, వారసత్వ సంపదని.. ప్రివెంటివ్ హెల్త్కు యోగా బెస్ట్ మెడిసన్ అంటుంటారు చంద్రబాబు.
అలాగే యోగా విశ్వవిద్యాలయాన్ని కూడా ఒకటి ప్రారంభించాలని చెబుతుంటారు చంద్రబాబు.. ఆ దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు ఏపీ ముఖ్యమంత్రి. యోగాతో పాటుగా నేచురోపతి కోర్సులతో ఒక డీమ్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి చంద్రబాుబ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా చెప్పారు. అమరావతిలో యోగా, నేచురోపతి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమాన్ని కూడా ఆ దిశగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట. యోగా కోసం నాన్ ప్రాఫిట్ సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు.
ఈ ఏడాది యోగాంధ్ర-2025 పేరుతో విశాఖపట్నం వేదికగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరవుతున్నారు. నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజా ప్రతినిధుల్ని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మంచి అడ్మినిస్ట్రేటర్, సీనియర్ రాజకీయ నేతగానే కాదు.. యోగాకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా గుర్తింపు ఉందనే చెప్పాలి.