
కొట్లాడుకుంటే ఏమొస్తుంది? కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోద్ది కదా. బేషజాలకు పోతే ఏమొస్తుంది. బేసిన్ల లెక్కలు తేల్చుకోవడమే కదా కావాల్సింది. రండి.. మాట్లాడుకుందాం.. నీటి వాటాలపై క్లారిటీకి వద్దామంటూ.. ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ ఏదైనా ఉందంటే.. అది జల జగడమే. గోదావరి, కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో మొదటి నుంచీ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏపీ బనకచర్ల ప్రతిపాదనతో జల జగడం మరింత ముదిరింది. ఈ ప్రాజెక్ట్తో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ వాదిస్తున్నప్పటికీ..
తెలంగాణలో పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. బనకచర్లను అడ్డుకుని తీరాలనే లక్ష్యంతో ఉన్నాయి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. ఈ విషయంపై కేంద్రాన్ని సైతం సంప్రదించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ విషయంలో ఓ వైపు పోరాటం చేస్తూనే.. మరోవైపు రాజీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
జల వివాదాలపై ఏపీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అంటటున్నారు. గొడవలు పెట్టుకోవడం కాదు.. చర్చలే తమకు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తానే ఆహ్వానిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్క రోజు కాదు.. అవసరమైతే 4 రోజులైనా కూర్చొని చర్చించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోనంటున్నారు. జూన్ 23న కేబినెట్ సమావేశం తరువాత ఏపీని చర్చలకు పిలుస్తామంటున్నారు. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు. అలాగని ఎవరి కోసమో తమ హక్కులను వదులుకునేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
బనకచర్లపై కేంద్రాన్ని సంప్రదించక ముందే తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే ఈ వివాదం ఉండేదే కాదన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరి బీఆర్ఎస్కు ఆయుధంగా మారిందన్నారు. చర్చల ద్వారానే నీటి వివాదాల పరిష్కారమవుతాయన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రుల స్థాయిలో చాలా అంశాలపై చర్చించామన్నారు. నీళ్ల పంచాయితీపై జూలై 6, 7 తేదీల్లో మళ్లీ ఢిల్లీకి వెళ్తానని రేవంత్ అన్నారు.
ఇక బీఆర్ఎస్పైనా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలుపు కోసం గోదావరి నీటిపై రాజకీయం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. అధికారం పోయిన అసహనంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు పండుతున్న పంటలకు కాళేశ్వరానికి సంబంధం లేదన్నారు. తెలంగాణకు కేసీఆర్, హరీష్రావు అన్యాయం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం పూర్తి కావాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలన్నారు రేవంత్. ఇప్పటి వరకు రూ.98వేల 902 కోట్ల బిల్లులు చెల్లించాంమని.. ఇంకా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..