సాధారణంగా పాము మనిషిని కరుస్తే ఏం జరుగుతుంది. కరిచిన పాము పెద్ద ప్రమాదకరమైంది కాకపోతే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అదే కాటు వేసింది విషపూరితమైన పాటు అయితే మనిషి క్షణాల్లోనే చనిపోతాడు. కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటన దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఓ యువకుడిని కాసేటిస పాము కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ పాము కాటుకు గురైన యువకుడికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఆశ్చర్యకర ఘటన బాలాఘాట్ జిల్లాలోని ఖుద్సోడి గ్రామంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖుద్సోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్పురే (25) అనే యువకుడు, ఇంటి వద్ద పొలం పనులు చూసుకోవడంతో పాటు కార్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సచిన్ గురువారం ఉదయం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో పనిచేస్తుండగా సచిన్ అనుకోకుండా ఓ పాముపై కాలు వేశాడు. దీంతో ఆ పాము సచిన్ను కాటువేసింది. అయితే, ఆశ్చర్యకరంగా సచిన్ కాటువేసిన ఆ పాము కొన్ని నిమిషాల్లోనే గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కానీ సచిన్కు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇక తనను కరిచిన పాము చనిపోవడాన్ని చూసి షాక్కు గురైన సచిన్ వెంటనే తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత సచిన్తో పాటు చనిపోయిన పామును కూడా తీసుకుని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ సచిన్ను పరిశీలించిన వైద్యులు షాకింగ్ విషయాలు తెలిపారు. సచిన్ను కరిచింది సాధారణ పాము కాదని, అత్యంత విషపూరితమైన డొంగర్బేలియా జాతికి చెందిందన్నారు.
ఇక ఈ ఘటనపై సచిన్ సచిన్ మాట్లాడుతూ.. తాను గత కొన్న సంవత్సరాల నుంచి పొలంలో లభించే చిడ్చిడియా, పిసుండి, పల్సా, నేరేడు, మామిడి, తూవర్, ఆజన్, కానుగ, వేప వంటి అనేక రకాల చెట్ల పుల్లలతో పళ్లు తోముకుంటున్నానని… ఆ మూలికా కలయిక వల్ల తన రక్తం పాముకు విషంగా మారి అది చనిపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన స్థానిక అటవీశాఖ అధికారి ధర్మేంద్ర బిసెన్ మాట్లాడుతూ.. ఓ పాము మనిషిని కరిచి ప్రాణాలు కోల్పోవడం అత్యంత అరుదైన ఘటన అన్నారు. కొన్ని సందర్భాల్లో పాము కాటు వేసిన తర్వాత తన శరీరాన్ని బలంగా మెలితిప్పుతుందని.. ఇలాంటి సమయంలో దాని విషపుతిత్తి పగిలిపోయే అవకాశం ఉందని, దాని వల్ల కూడా పాము ఆకస్మికంగా మరణించవచ్చని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..