AP Govt Deliver Ration 5 Days Early: ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూలైలో ఇవ్వాల్సిన రేషన్ను జూన్ 26 నుంచే పంపిణీ చేయనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ డీలర్లతో సమావేశంలో పలు సూచనలు చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతీ నెలా 26 నుంచి 30 తేదీలలోపు ఇంటి దగ్గరే రేషన్ అందించాలని నిర్ణయించారు. జూన్ నుంచి డీలర్ల ద్వారా పాత పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తున్నారు.
హైలైట్:
- ఏపీలో వారందరికి తీపికబురు
- ఐదు రోజులు ముందే రేషన్
- మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

సన్న బియ్యం సాగును ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లను కోరారు మంత్రి మనోహర్. ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగులకు ప్రతీ నెలా 26 నుంచి 30 తేదీలలోపు ఇంటి దగ్గరే రేషన్ అందించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఐదు రోజులు ముందే రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.. ఏపీ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేశారు. జూన్ నుంచి డీలర్ల ద్వారా మళ్లీ పాత పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. దాదాపు 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరే రేషన్ అందిస్తున్నారు. మిగిలిన వారు రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సన్నబియ్యాన్ని ప్రోత్సహిస్తోంది. బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలి అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా సన్న బియ్యం ఉత్పత్తిని పెంచాలన్నారు.
జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు అందజేసే విధానం అమల్లోకి వచ్చింది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్లు.. కార్డుదారులకు సరుకులు అందిస్తారు. అయితే దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తున్నారు.
ఏపీలో వారందరికి ఐదు రోజులు ముందే రేషన్ ఇంటికి డోర్ డెలివరీ.. మంత్రి కీలక నిర్ణయం
‘గత ప్రభుత్వ హయాంలో రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేశారు.. రేషన్ డోర్ డెలివరీ చేస్తామని చెప్పినా.. నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే వాహనం ఒక చోట ఆపేసి రేషన్ పంపిణీ చేసేవారు.. అక్కడికి వచ్చి సరుకులు తీసుకోమనేవారు. పేదలకు సరుకులు అందక చాలా ఇబ్బంది అయ్యింది. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకోవలసి వచ్చేది.. చిరుద్యోగాలు చేసేవాళ్ళు సెలవు పెట్టవలసి వచ్చేది. అలాగే రేషన్ బియ్య అక్రమ రవాణాపై ప్రభుత్వం దీనిపై విచారణ చేసింది. వేలాది టన్నుల బియ్యం కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ రేషన్ విధానం ఆచరణలో విఫలమైంది.ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అని ప్రభుత్వం చెబుతోంది.