గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఆయనకు పోన్ చేసిన సిట్ అధికారులు.. గత బీఆర్ఎస్ హాయాంలో మీ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని..ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం తీసుకునేందుకు బండిసంజయ్ను సమయం కోరినట్టు సమాచారం.
అయితే పోలీసులు తెలిపిన సమాచారంపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానని పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపో మాపో కేంద్రమంత్రికి సిట్ నోటీసులు జారీ చేయనుంది సిట్. అయితే గత బీఆర్ఎస్ హాయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్.. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఇప్పటికే పలుమార్లు ఆయన ఆరోపించారు. అంతకే కాకుండా కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు తనతో పాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను నాటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది గతంలో ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి సంజయ్ నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు.
కరీంనగర్ ఎంపీ ఆఫీసులో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించి భంగపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఫోన్ ట్యాపింగ్తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలుమార్లు బహిరంగ సభల్లో, మీడియా వేదికల ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేసి భార్యాభర్తల మధ్య సంభాషణలను కూడా విన్నారని అప్పట్లో బండి సంజయ్ ఆరోపించారు.అయితే నాడు బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని సిట్ వర్గాలు చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ ఇప్పటికే వందలాది మంది ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టు నిర్థారించగా తాజాగా బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆయన్ను సాక్షిగా పరిగణించి వాంగ్మూలం తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో బండి సంజయ్ వాంగ్మూలంపై తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..