ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసి.. యోగాంధ్రలో పాల్గొన్నారు. విశాఖలోని INS చోళ నుంచి ఆర్కే బీచ్ దగ్గరకు చేరుకున్న మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్తోపాటు మంత్రులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “యోగా ప్రపంచాన్ని కలిపింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. ఇది మనతోనే సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవనశైలిని యోగా మార్చింది. నేవీకి చెందిన నౌకల్లో యోగాసనాలు వేస్తున్నారు. యోగా అందరి కోసం. ప్రగతి, ప్రకృతి సంగమస్థలి విశాఖ నగరం. చంద్రబాబు, పవన్, లోకేష్కు అభినందనలు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ థీమ్తో ఈ సారి యోగా డే జరుపుకుంటున్నాం. ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది.
అందరి క్షేమమే నా కర్తవ్యమని భారతీయ సంస్కృతి నేర్పుతుంది. ప్రపంచం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో యోగా శాంతికి తోడ్పడుతుంది. యోగా మనలో మానవత్వం పెంచుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా ఒక అద్భుత సాధనం. నేను నుంచి మనం అనే భావనకు తీసుకెళ్లే ఆయుధం. ఒబేసిటీ అనేది ప్రపంచానికి పెద్ద సమస్య. తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలను 10 శాతం తగ్గించాలి. యోగాను ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలి. అందరికి యోగాతో ప్రతి రోజు మొదలవ్వాలి.” అని ప్రధాని మోదీ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పలువురిని ప్రత్యేకంగా పలకరించారు మోదీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి